నటసింహం నందమూరి బాలకృష్ణ కోపిష్టి అని చాలా మంది అంటుంటారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అదే మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు విశిష్ట అతిథులుగా సూపర్స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ స్పీచ్ ఇరగదీశారు. సీనియర్ ఎన్టీఆర్తో తనకున్న అనుభవాలను, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే బాలయ్యపై హాట్ కామెంట్స్ చేశారు.
`సినిమాల్లో బాలయ్య కంటిచూపుతోనే చంపేస్తారు. అలాగే జీప్ ని బాలయ్య ఒక తన్ను తంతే అది ఇరవై ముప్పై అడుగుల దూరంలో వెళ్ళిపడుతంది. అటువంటి పవర్ఫుల్ సీన్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వాళ్లు చేసినా జనం ఒప్పుకోరు. కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యను తెలుగు జనం బాలయ్యలా చూడలేదు. మహానుభావుడు ఎన్టీఆర్ను బాలయ్యలో చూసుకున్నారు. ఆ ఎన్టీఆర్ యుగపురుషుడు ఏమైనా చేయగలరు కదా. బాలయ్య కూడా అన్నీ చేస్తాడు. అయితే పెద్ద కోపిష్టి.. కానీ పాల లాంటి మనసు` అని రజినీకాంత్ పేర్కొన్నారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.