వారసుడి ఊసే లేదేంటి.. ఇలాగైతే ఇక్క‌డ చాలా క‌ష్టం ద‌ళ‌ప‌తి!

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాల్లో `వారసుడు(త‌మిళంలో వ‌రిసు)` ఒకటి. విజయ్ ద‌ళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ‌ర‌త్‌కుమార్‌, శ్రీకాంత్‌, శామ్‌, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత కుటుంబంలో ఏర్ప‌డిన స‌మ‌స్య‌ల‌ను ఓ కొడుకు ఎలా చ‌క్క‌దిద్దాడ‌నే పాయింట్‌తో ఈసినిమా తెర‌కెక్కుతోంది. అయితే తమిళ ప్రమోషన్స్ తో పోలిస్తే తెలుగు ప్రమోషన్‌లు నత్త నడకన సాగుతున్నాయి.

తెలుగులో అస‌లు వార‌సుడి ఊసే లేదు. చిత్రయూనిట్‌ కూడా అసలు తెలుగు ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌పై ఆస‌క్తి చూడటం లేదు. తమిళంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ జరిపిన మేక‌ర్స్‌.. తెలుగులో కనీసం ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టలేదు. వారసుడిపై అసలు అంచనాలే లేవు. ట్రైల‌ర్ కు సైతం మంచి రెస్పాన్స్ ద‌క్క‌లేదు. కేవలం దిల్‌రాజు బ్రాండ్‌, ద‌ళ‌ప‌తి క్రేజ్ తోనే సినిమా ఆడుతుందంటే పొరపాటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు ప్రమోషన్‌లు చాలా అవసరం. లేదంటే తెలుగులో వ‌ర‌సుడు బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డం చాలా క‌ష్టం అయిపోతుంది.