మోదీ టార్గెట్‌గానే..ఖమ్మంలో కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయిందా!

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సభకు భారీగా జనం తరలివచ్చేలా చేయడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ఇక ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు ఇతర జాతీయ నేతలు రావడంతో..సభ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ఆ ముగ్గురు సీఎంలతో పాటు కేసీఆర్..కేవలం కేంద్రంలోని మోదీ సర్కార్ టార్గెట్ గానే విరుచుకుపడ్డారు. బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. బీజేపీపై పోరాటానికి కేసీఆర్‌కు తమ మద్ధతు ఉంటుందని ముగ్గురు సీఎంలు ప్రకటించారు.

ఇక కేసీఆర్ యథావిధిగా..బీజేపీపై ఫైర్ అవుతూనే..బీఆర్ఎస్ ఏం చేస్తుందనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు.  దేశమంతటా తెలంగాణ పథకాలు అమలవ్వాలని, 24 గంటల కరెంట్, రైతులకు ఉచిత కరెంట్, దళితబంధు, రైతుబంధు లాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రూ.42 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్‌ఐసీని ప్రైవేటీకరించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, దీనిపై ఎల్‌ఐసీ కార్మికులు పోరాడాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దానిని తిరిగి ప్రభుత్వపరం చేస్తామన్నారు. దేశసైన్యంలో అగ్నిపథ్‌ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగిస్తామన్నారు.

ఇలా హామీలు ఇస్తూనే..కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడ్డారు. అయితే ఈ సభ ద్వారా దేశ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తామనే విధంగా కేసీఆర్ గళం వినిపించారు. విపక్షాలతో కలిసి బీజేపీని గద్దె దించుతామని అంటున్నారు. అయితే సభ ద్వారా దేశ రాజకీయాల్లో కేసీఆర్ పేరు ఎక్కువ వినిపించే ఛాన్స్ ఉంది. కానీ కేంద్రంలోని బీజేపీని గద్దె దించడం అనేది కేసీఆర్‌కు సాధ్యమవుతుందా? అనేది చెప్పలేని పరిస్తితి. చూడాలి మరి కేసీఆర్ రానున్న రోజుల్లో కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో.