ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే` సీజన్ 2లో ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరు అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయత ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుండగా.. గురువారం రాత్రి ఫస్ట్ పార్ట్ను ఆహా వారు బయటకు వదిలారు.
అయితే ఈ షోలో దర్శకధీరుడు రాజమౌళి వల్ల అందరూ తిడతారంటూ ప్రభాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే సీరియస్ గా కాదు.. ఫన్నీగానే లేండి. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రభాస్ `ఛత్రపతి` సినిమా ఇంటర్వెల్ సీన్ ను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ఛత్రపతి ఇంటర్వెల్ లో చుట్టూ జనం ఉన్నారు. నా మొహమాటం తెలిసిందే కదా. అందువ్ల ఆ డైలాగ్స్ సైలెంట్ గా చెప్తాను.. డబ్బింగ్ లో కవర్ చేసుకుందాం అని రాజమౌళికి చెప్పగా ఆయన ఓకే అన్నారు.
అప్పటి నుంచి అదే అలవాటుగా మారిపోయిందని, ఇప్పటికే క్రౌడ్ ఎక్కువగా ఉంటే డైలాగులు బిగ్గరగా చెప్పలేను. ఇది తెలిసి మిగిలిన డైరెక్టర్స్ రాజమౌళి వల్లే ఇలా అయ్యాను అంటూ తిడుతూ ఉంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో విశ్వనాధ్ గారు డైరెక్ట్ గా పిలిచి తిట్టేశారు. డైలాగులు అందరికీ వినపడేలా బిగ్గరగా చెబ్తూ ప్రాక్టీస్ చేయమని సలహా ఇచ్చారు. కానీ, నా పద్ధతిని మార్చుకోలేకపోయాను` అంటూ ప్రభాస్ సరదాగా చెప్పుకొచ్చారు.