ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడంటే తడబాటులో ఉంది. కానీ, వాస్తవానికి సంస్థాగత ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉంది. దీనికి కాస్త బూస్టప్ ఇస్తే.. పార్టీ పుంజుకోవడం.. మళ్లీ పునర్వైభవం ఖాయమ నేది పార్టీ నాయకుల అభిప్రాయం. దీనికి కావాల్సిందల్లా.. కొంత వ్యూహం.. మరికొంత చొరవ. ఇవి రెండూ లేకపోవడంతోనే పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ విఫలమైంది.
బహుశ..ఈ దిశగా ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షులుగా వ్యవమరించిన రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్లు ప్రయత్నించలేదు. కేవలం క్షేత్రస్థాయిలో నాయకులను కదిలిస్తాం అని మాట మాత్రంగా చెప్పారు తప్ప.. ఇంకేమీ చేయలేదు. కానీ, ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు ప్రస్తుత కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన టీడీపీతో చేతులు కలిపితే తప్పు లేదనే దిశగా ఆలోచన చేస్తున్నారని సమాచారం.
ఇటీవల ఆయన కడపలో దర్గాను దర్శించారు. ఈ క్రమంలో కొందరు టీడీపీ నేతలను ఆయన స్వయంగా ఆహ్వానించారు. దీనికి వారు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత.. కొందరు పార్టీ సీనియర్లతోనూ ఆయన తన మనోగతం పంచుకున్నారు. తెలంగాణలో 2018లో కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేశాయని.. ఇదే మంత్రా న్ని ఏపీలోనూ జపిద్దామని.. ఆయన చెప్పారు. అయితే, అధిష్టానం ఒప్పుకొంటే తమకు అభ్యంతరం లేదని వారు చెప్పినట్టు సమాచారం.
ఇక్కడ అధిష్టానం కన్నా.. కాంగ్రెస్తో కలిసేందుకు చంద్రబాబు ఒప్పుకొంటారా? అనేది మరో ప్రశ్న. గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్ ఓటు పదిలంగా ఉన్న సమయంలో చంద్రబాబు ను ఒప్పించగలిగితే..వచ్చే ఎన్నికల్లో కనీసం.. 10-20 స్థానాల్లో అయినా గెలిచే అవకాశం ఉంటుందని.. తద్వారా.. ఓటుబ్యాంకు పెరుగుతుందని రుద్రరాజు ఆలోచన. పునర్వైభవం పక్కన పెట్టినా..ముందు అసలు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన తలపోస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.