వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ గా శ్రుతి హాసన్నే నటిస్తోంది. పైగా ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాలను విడుదల చేయబోతున్నారు. ఒకే బ్యానర్ లో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవుతుండటంతో.. `వీర సింహారెడ్డి`, `వాల్తేరు వీరయ్య` చిత్రాలపై నెట్టింట రకరకాలు చర్చలు జరుగుతున్నాయి.
సరిపడా థియేటర్స్ దొరకవని, వసూళ్లకు భారీగా గండి పడే అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బాలయ్య, చిరు సినిమాలకు కొత్త కష్టం వచ్చి పడేలా కనిపిస్తోంది. అదేంటంటే.. నైజాంలోని థియేటర్ల ఓనర్లు థియేటర్ల రెంట్లను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారట. అదే జరిగితే మొదట మైత్రీ వారి సినిమాలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. కలెక్షన్ల విషయంలో భారీగా నష్టపోయే ఛాన్స్లు సైతం ఉంటాయని అంటున్నారు. మరి నిజంగా థియేటర్ల రెంట్లు పెంచితే మైత్రీ నిర్మాతలు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.