రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, విలువలు, ఆశయాలు అన్నీ పక్కకు పోతున్నాయి. డబ్బు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ జాడ్యం మరింత ఎక్కువైంది. మొన్నటి వరకు ఒక ఎత్తైతే.. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక మరో ఎత్తైంది. ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికను పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి తెలంగాణపై ఉప ఎన్నికను బలవంతంగా రుద్దారు. ఇది బీజేపీ అగ్రనేత అమిత్ షా డైరెక్షన్ లోనే జరుగుతోందని అందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. రాజగోపాల్ గెలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా సంపన్నుడైన ఆయన విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
లేని ఉప ఎన్నిక వచ్చి తమ మీద పడ్డందుకు కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇపుడు ప్రచారంలో పుంజుకొంది. అన్ని పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. బీజేపీ అంత కాకపోయినా.. గులాబీ పార్టీ కూడా భారీగానే చేతి చమురు వదిలించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్థిక వనరుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలకు అందనంత దూరంలో నిలిచింది. కేవలం సెంటిమెంటును నమ్ముకొనే ప్రచారం సాగిస్తోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖర్చు రూ.500 కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం. టీఆర్ఎస్, బీజేపీలు కలిపి ఓటుకు రూ.5వేల నుంచి పది వేల వరకు పంచిన దాఖలాలున్నాయి. మునుగోడు ఖర్చు అంతకు మించి అన్నట్లు సాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఓటుకు రూ.లక్ష వరకు అయినా పంచేందుకు వెనుకాడడం లేదట. వీలైతే ఓటర్లకు ఖరీదైన కార్లు, ద్విచక్రవాహనాలు కొని పెడుతున్నారట. కారు పార్టీ కూడా తమకు తోచిన విధంగా తాయిలాలు అందిస్తోంది.
అయితే.. అసలైన సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఈ ఎన్నిక ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడితే అభ్యర్థుల కొంప కొల్లేరు అవుతుంది. భారీగా ఖర్చు పెట్టుకునే వారికే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఓటర్లలో కూడా అప్పుడే కదలిక మొదలైంది. మునుగోడు ఉప ఎన్నికను నిశితంగా గమనిస్తున్న తెలంగాణ ప్రజలు తాము కూడా భారీగానే ఆశిస్తున్నట్లు సమాచారం.
ఓటుకు లక్ష చొప్పున అందరూ డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇతర నియోజకవర్గాల్లోని కొంతమంది ఓటర్లను కదలిస్తే.. వచ్చే ఎన్నికల్లో ‘లక్ష కొట్టు.. ఓటు పట్టు’ అనే నినాదం వినిపిస్తున్నారు. ఒక్కొక్కరికి లక్ష ఇస్తేనే ఓటు వేస్తామని తెగేసి చెబుతున్నారు. ఇది అన్ని నియోజకవర్గాలకూ పాకితే ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఇబ్బందికరమే. ఇక కాంగ్రెస్ పోటీకి కూడా దూరంగా ఉండే పరిస్థితి వచ్చినా రావొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో..