ఏపీ రాజధాని అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎకరాల భూములు ఇచ్చామని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామని.. రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వైపు.. ప్రజలు నిలబడుతున్నారనే సంకేతాలు వచ్చాయి. ఇటు వైపు న్యాయవ్యవస్థ.. అటువైపు ప్రజలు కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.
గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు నిర్వహించిన పాదయాత్ర కావొచ్చు.. ప్రస్తుతం జరుగుతు న్న అమరావతి నుంచి అరసవల్లి వరకు.. పాదయాత్రకు కూడా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్త మవుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు హారతులు పడుతున్నారు. అయితే.. వైసీపీ మంత్రులు.. నాయకులు.. మాత్రం గరం గరం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రపై యుద్ధం ప్రకటించారని.. ఉత్తరాంధ్ర ప్రజల పొట్ట కొడుతున్నారని.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, మంత్రి సీదిరి అప్పలరాజు వరకు అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక, మరోమంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం.. ఉత్తరాంధ్రపైకి దీనిని దండయాత్ర అనే వర్ణించారు. రాజధాని ఒక్కచోటే ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ వంటి పరిణామాలు ఏర్పడి.. మరోసారి రాష్ట్ర విభజన డిమాండ్లు వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పారు. ఇక, మిగిలిన నాయకులు కూడా ఇలానే వ్యాఖ్యానించారు. కానీ, నాయకులు మాట్లాడుతున్నారే తప్ప.. ఎక్కడా ప్రజల్లో మాత్రంకదలిక లేదు. మూడు రాజధానుల కోసం.. ఎవరూ బయటకు రావడం లేదు. ఎక్కడా వైసీపీ నాయకులకు అనుకూలంగా కూడా వ్యాఖ్యలు చేయడం లేదు.
పోనీ.. ఎంతో బిజీగా ఉన్న ప్రజలు బయటకు రాలేదనే అనుకుందాం.. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆ వేదికగా అయినా.. వైసీపీ నాయకులకు మద్దతుగా నిలబడాలి కదా! కానీ, అలా కూడా లేదు. దీనికి కారణం.. రైతులు చేసిన త్యాగాలు.. న్యాయస్థానం ఇస్తున్న తీర్పులను గౌరవించాలనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోందనే భావన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి వైసీపీ నాయకులకు ఎలాంటి మద్దతు రావడం లేదని అంటున్నారు.