మోహన్ బాబు సభ్యత, సంస్కారంలేని వ్యక్తి… సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు?

మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ఓ సీనియర్ నటుడిగా మోహన్ బాబుది చాలా ఏళ్ల ప్రస్థానం. ఒక విలన్ నుండి హీరోగా ఎదిగిన తీరు ఎవరికీ సాధ్యపడనిది అని చెప్పుకోవాలి. నటనతోపాటు.. ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ అనే బేనర్ ని స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇకపోతే గతేడాది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కి ఫుల్ పోటీ ఇచ్చిన విష్ణు ప్యానెల్.. చివరికి విజయం సాధించింది. దాంతో ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు అందుకున్నారు.

అక్కడి వరకు ఒకేగానీ, ఆ ఎన్నికల టైమ్ లో జరిగిన విషయం గురించి నటుడు బెనర్జీ ఇప్పుడు మరోసారి మీడియా వేదికగా మాట్లాడారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రతివారం ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్డ్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంకి ఈసారి గెస్ట్ గా నటుడు బెనర్జీ హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో తన గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు పంచుకున్నారు. తాను డైరెక్టర్ అవుదామని వచ్చానని, కానీ అమితాబ్ బచ్చన్ సినిమాకు పనిచేస్తున్న టైమ్ లో ఓ కన్నడ నటుడు రాకపోవడంతో.. తను ఆ సీన్స్ చేశానని, అలా నటుడిని అయిపోయానని బెనర్జీ అన్నారు.

మోహన్ బాబు మీపై చేయి చేసుకున్నారట కదా? అని ఆర్కే అడగ్గా.. కళ్లు తుడుచుకుంటూ బెనర్జీ చాలా ఎమోషనల్ అవ్వడం చాలామందిని కలచివేసింది. ఇక దానికి సమాధానంగా ‘అది మోహన్ బాబు విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేశానని’ చెప్పడం కొసమెరుపు. ఇక మా ఎన్నికల టైమ్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసినదే. ఒక్కసారి వెనక్కి వెళితే, “ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోని తనీష్ ని మోహన్ బాబు ముందుగా తిట్టారు. ఆ టైమ్ లో అక్కడికి వెళ్లి, గొడవలొద్దని విష్ణుతో చెప్పాను. వెంటనే మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు. అరగంటపాటు బూతులు తిడుతూనే ఉన్నారు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను అలా తిట్టేసరికి షాక్ లో ఉండిపోయాను!” అని అప్పట్లో మీడియా ముందు బెనర్జీ కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసినదే.