కుప్పంలో మళ్ళీ అదిరిపోయే షాక్!

జగన్…చంద్రబాబు కంచుకోట కుప్పంని వదిలేలా లేరు. ఎలాగైనా ఈ సారి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే వైసీపీ రాజకీయం ఉంది. ఈ స్థానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబు బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ బలమైన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. కార్యకర్తలని లాగేశారు.

ఇక పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇలా కుప్పంలో బాబుని ఓడించే దిశగా పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు. దీంతో బాబు కూడా అలెర్ట్ అయ్యి…మూడు నెలకొకసారి కుప్పం వచ్చి పార్టీ పరిస్తితులని సరి చేసుకుంటున్నారు. ఇటీవల కూడా కుప్పం వచ్చారు. అయితే బాబుకు దెబ్బకొట్టడానికి ఇప్పుడు డైరక్ట్ జగన్ కుప్పంలో అడుగు పెడుతున్నారు. ఈ నెల 22 న కుప్పంకు రానున్నారు. కుప్పం వచ్చి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.

కుప్పం మున్సిపాలిటీని అభివృద్ధి బాట పట్టించనున్నారు. బాబు చేయలేనిది తాము చేశామని చూపించనున్నారు. అలాగే కుప్పంలో భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభ ద్వారా కుప్పంలో ఇంకా బలంగా ఉన్న టీడీపీని దెబ్బకొట్టాలని పెద్దిరెడ్డి చూస్తున్నారు. ఇంకా పలు గ్రామాల్లో బలంగా ఉన్న టీడీపీ కార్యకర్తలని వైసీపీలోకి జగన్ సమక్షంలో తీసుకురానున్నారు.

ఆ మధ్య కొందరు టీడీపీ కార్యకర్తలని గుర్తింపు కార్డులు చూపించి మరీ వైసీపీలో చేర్చుకున్నారు. ఇక జగన్ సమక్షంలో చేరేటప్పుడు కూడా అదే చేయనున్నారని తెలుస్తోంది. భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలని వైసీపీలోకి తీసుకొస్తారని తెలుస్తోంది. దీంతో బాబుకు మరొకసారి భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాల నుంచి బాబు ఎలా బయటపడతారో చూడాలి.