సొంత గడ్డలో ‘సైకిల్’కు కష్టాలు?

2019 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయనే చెప్పొచ్చు..ఎప్పుడైతే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైందో అప్పటినుంచి సైకిల్ కు కష్టాలు పెరుగుతూ వచ్చాయి. పైగా అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. అయితే ఎన్నికలయ్యి మూడేళ్లు దాటిన సరే టీడీపీకి కష్టాలు తొలగినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో బలపడి ఉంటే… టీడీపీకి ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదని చెప్పొచ్చు. కానీ ఆ పార్టీ పూర్తిగా బలపడకపోవడమే పెద్ద ఇబ్బంది.

ఆఖరికి బడా నేతల సొంత స్థానాల్లో కూడా టీడీపీ పూర్తిగా పికప్ అయినట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు సీనియర్ లేదు…జూనియర్ లేదు అందరూ నేతలు చిత్తుగా ఓడిపోయారు. అలాగే కంచుకోటల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. అయితే ఇప్పటికీ కొన్ని స్థానాల్లో పార్టీ పికప్ అవ్వడం లేదు. పైగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో కూడా టీడీపీ బలం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.

అలాగే చంద్రబాబు సొంత గడ్డ అయిన చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఇక్కడ ఎప్పుడో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది…మళ్ళీ అక్కడ గెలవలేదు…ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచేలా లేదు. అటు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు గ్రామం ఉన్న పామర్రులో కూడా టీడీపీ గెలవలేదు. మరి ఈ సారి అక్కడ గెలుస్తుందో లేదో చెప్పలేం.

ఇక సీనియర్ నేత యనమల రామకృషుడు సొంత గడ్డ తునిలో టీడీపీ గెలుపుకు దూరమై 15 ఏళ్ళు అవుతుంది…మరి ఈ సారి అక్కడ గెలిచే అవకాశాలు తక్కువే. ఇటు మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…సొంత స్థానం సర్వేపల్లిలో టీడీపీ 1999 ఎన్నికల్లో గెలిచింది..వరుసగా నాలుగుసార్లు సోమిరెడ్డి ఓడిపోయారు. మరి ఈ సారి ఏం చేస్తారో చూడాలి. అటు జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, విజయనగరంలో అశోక్ గజపతి రాజు, నర్సిపట్నంలో అయ్యన్నపాత్రుడు…ఇలా సీనియర్లు తమ సొంత స్థానాల్లో ఈ సారి సత్తా చాటుతారో లేదో చూడాలి.