ఔను! విజయవాడ ఎంపీ సీటు ఎవరిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. గత 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత.. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. ఇక్క డ పాగా వేయాలని.. వైసీపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ వరుస విజయాలు దక్కించుకున్న ఎంపీ కేశినాని నాని పరిస్థితి పార్టీలో చర్చకు దారితీస్తోంది. నానీకి.. పార్టీ అధిష్టానం నుంచి మద్దతు ఉంది.
కానీ, క్షేత్రస్థాయిలో నాని పరిస్థితి బాగోలేదు. ఎవరూ కూడా.. ఆయనకు సపోర్టు ఇచ్చే పరిస్థితి లేదు. తూర్పు నియోజకవర్గం లోను.. పశ్చిమ నియోజకవర్గంలోనూ.. కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలోనే ఉన్నప్పటికీ.. నానికి వారి నుంచి సహాయ సహకారాలు అందుతున్న పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నానికి మళ్లీ ఇక్కడ టికెట్ ఇచ్చినా.. ఆయన ఒంటరి పోరుతోనే నెగ్గగుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి గత ఎన్నికల్లోనూ ఆయన గెలిచినా.. విజయవాడన గర పరిధిలో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు వైసీపీ ఖాతాలో వేసుకుంది. దీనిని బట్టి విజయవాడలో నానికి సహకరించేవారు కనిపించడం లేదు.
మరోసారి.. ఇప్పుడు కూడా నాని విషయం ఇలానే చర్చకు వస్తోంది. ఆయనకు టికెట్ ఇవ్వడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ, ఆయన గెలుపు మాత్రం.. ప్రశ్నగానే మిగిలిపోతోంది. పైగా.. వైసీపీ ఇక్కడ సెంట్రల్, పశ్చిమలో పాగా వేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి నాయకుల సహకారం లేకపోతే.. కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, వైసీపీ విషయాన్ని చూసుకుంటే.. ఇక్కడ నాయకుడు లేని పరిస్థితి కనిపిస్తోంది. గత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ .. ఓడిపోయారు. తర్వాత.. ఆయన పార్టీకి దూరమయ్యారు. దీంతో ఇక్కడ ఎంపీ స్తానంలో ఎవరు ఉన్నారు? ఎవరు పోటీ చేస్తారు? అనే చర్చ సాగుతోంది.
అంటే.. టీడీపీకి నాయకుడు ఉన్నా.. సహకరించని నాయకులు.. కార్యకర్తలు ఉంటే.. వైసీపీకి అసలు నాయకులే లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నాయకులు.. ఇక్కడ ఎవరు ఈ సీటును దక్కించుకుంటారు? అనే చర్చ చేస్తున్నారు. వైసీపీ తరఫున సినీ రంగానికి చెందిన నాయకులను నిలబెట్టే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. అయితే.. స్థానికేతరులు ఎవరికి ఇచ్చినా.. ఫలితం లేదని.. పైగా ఎన్నికలకు అప్పటికిప్పుడు వచ్చి ప్రచారం చేసుకున్నా.. ఎలాంటి ప్రయోజనం లేదని కూడా అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. విజయవాడ సీటును ఎవరు దక్కించుకుంటారు. అనేది ఆసక్తిగా మారింది.