టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వ‌చ్చే పండుగ మ‌హానాడు. ప్ర‌తి మే నెల‌లోనూ.. ప‌సుపు పండుగ‌ను ఘ‌నంగా చేసుకుంటారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను.. భూత, భ‌విష్య‌త్, వ‌ర్త‌మాన కాలంలో పార్టీ నిర్దేశాల‌ను కూడా ఈ స‌భ‌లో చ‌ర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ ముఖ్య నేత‌లు అంద‌రూ కూడా హాజ‌రు కావ‌డం తెలిసిందే. అయితే.. గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా.. మ‌హానాడును వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించుకున్నారు. ఈ సారి క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌లు మ‌రో ఏడాదిన్న‌ర‌లోనే ఉన్నందున‌.. పార్టీ కార్యాచ‌ర‌ణ‌.. తీర్మానాల‌కు భ‌విష్య‌త్ వ్యూహాల‌కు ఈ స‌మావేశం వేదిక‌గా మార‌నుంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ద‌ఫా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఒంగోలులో నిర్వ‌హిస్తుండ‌డం మ‌రింత విశేషంగా ఉంది. వాస్త‌వానికి ఇలా.. జిల్లాల స్థాయిలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి. ఈ ద‌ఫా మూడు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న ఈ మ‌హానాడును ఒంగోలులో మే 28, 29న‌ నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఈ వేడుక విష‌యం.. స్థానికంగా ఉన్న ఓ ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచుతోంద‌ని.. ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న ఆయ‌న‌.. గ‌తంలో టీడీపీలో చ‌క్రం తిప్పారు. ప్ర‌స్తుతం ఒంగోలులో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మానికి స‌రంజామా ఏర్పాటు చేయాల్సి రావ‌డంపై .. ఇక్క‌డి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో ఉన్నా.. ఆయ‌న ప్రాణం మాత్రం టీడీపీలో ఉంద‌ని కొన్నాల్లుగా ప్ర‌చారం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఏర్పాటు చేయ‌నున్న మ‌హానాడుకు ఎంత లేద‌న్నా.. 25 ల‌క్ష‌లు స‌మ‌కూర్చాల‌ని.. ఆయన భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ప్రాణం అటుంది క‌నుక‌.. ఆయ‌న ఆమాత్రం ఇచ్చేందుకు వెనుకాడ‌రు. కానీ, ఈ విష‌యం వైసీపీకి తెలిసిపోతే.. ఎలా? అనేది ఆయ‌న ఆవేద‌న‌.

అందుకే ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వైసీపీలో జోరుగా తిరుగుతున్నారు. త‌న‌ను తాను టీడీపీకి దూరం అనే మాట‌ను తెచ్చుకు నేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీలో ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ముందుంటున్నారు. దీంతో ఆయ‌న మారిపోయారు.. ఇంక‌, టీడీపీ వాస‌న‌ల జోలికి వెళ్ల‌రు.. అనే మాట‌ను అనుకునేలా చేస్తున్నారు. అయితే.. మ‌హానాడు ఒంగోలులోనే నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న‌కు ముందే తెలుసా? అంటే.. చెప్ప‌లేమ‌ని ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు. ఏదేమైనా ఆయ‌న టీడీపీపై ప్ర‌మే కురిపిస్తున్నారని.. వైసీపీలో చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలో ఇప్పుడు ఆర్థిక సాయం వ‌ర‌కు వెళ్ల‌డం.. రేపు ఏం జ‌రుగుతుందో న‌న్న చ‌ర్చ అయితే.. సాగుతోంది.