ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ చాలా సానుకూల వాతావరణంలోనే ముగిసిందని చెప్పాలి. ఈ సమావేశం తర్వాత హీరోలు, దర్శకులు మాట్లాడుతూ తామంతా హ్యాపీ అని ప్రకటించారు. ప్రభాస్, మహేష్బాబు, రాజమౌళి లాంటి వాళ్లంతా మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు. తమ సమస్యలపై పెద్ద మనస్సుతో స్పందించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ భేటీలో సీనియర్లు అయిన పోసాని కృష్ణమురళీతో పాటు ఆర్. నారాయణ మూర్తి కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశం తర్వాత పోసాని కృష్ణమురళీ మీడియాతో మాట్లాడలేదు. కనీసం ఆయనకు జగన్కు ఓ కృతజ్ఞత అనో.. లేదా చిరంజీవిని ప్రశంసించడమో చేయలేదు. దీనికి కారణం ఏమై ఉంటుందా ? అని అందరూ ఆరాలు తీస్తున్నారు. సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడిందని కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి జగన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు.
ఇక పోసాని స్పందించక పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కొంత కాలం క్రితం పవన్ అభిమానులు వర్సెస్ పోసాని మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. అప్పుడు సినీ సమస్యలపై పవన్ రాజకీయ విమర్శలు చేయడాన్ని పోసాని గట్టిగా ఖండించారు. పవన్పై ఘాటు విమర్శలు చేశారు. దీంతో పవన్ అభిమానులు రెచ్చిపోయి పోసానిని టార్గెట్ చేశారు. ట్రోల్ చేశారు. పవన్ తన అభిమానులను కంట్రోల్ చేసుకోవాలని కూడా పోసాని చురకలు వేశారు.
ఆ తర్వాత పవన్ అభిమానులు పోసాని ఇంటిపై దాడికి దిగారు. ఇప్పుడు పవన్ అన్న చిరంజీవి పెద్దన్న పాత్రలో మధ్యవర్తిగా ఉన్నారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. చిరంజీవి టీంలో రాకుండా పోసాని స్పెషల్గానే ఈ సమావేశానికి వచ్చారు. ఇప్పుడు మీటింగ్ తర్వాత కూడా ఆయన ఎవ్వరితో కలవకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు ఏం మాట్లాడినా ఏదో ఒక కాంట్రవర్సీ అవ్వడం ఇష్టంలేకే పోసాని మీడియాకు దూరంగా ఉన్నారని టాక్ ?