ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!

దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్యఅతిథిగా సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ వంటి హిందీ ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. సోనీ ప్లస్ ప్రీ రిలీజ్ వేడుక హక్కులను పొందింది. కార్యక్రమాన్ని ఆ టీవీ లో అతి త్వరలో ప్రసారం చేయనున్నారు. తెలుగునాట ప్రీ రిలీజ్ ఈవెంట్స్, విజయోత్సవ సభలు నిర్వహించడం మామూలే. ఒక్కోసారి బహిరంగ సభ లాగా లక్షలాది మంది మధ్య విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు కనిపించవు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వంటివి చాలా సింపుల్ గా నిర్వహిస్తుంటారు.

అయితే మొదటిసారిగా బాలీవుడ్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వహించి బాలీవుడ్ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఏకంగా ఈవెంట్ నిర్వహణ కోసమే మేకర్స్ 9 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎంత గ్రాండ్ గా నిర్వహించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఈవెంట్ నిర్వహించిన ప్రాంతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నిలువెత్తు కటౌట్లు ఉంచారు. ఇలాంటి కటౌట్ల సంస్కృతి బాలీవుడ్ లో లేదు. ఈ కటౌట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద ఎంతో ఆకర్షణగా నిలిచాయి. అంతేకాక తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఈవెంట్ లో పాల్గొని రచ్చరచ్చ చేశారు.

ప్రత్యేకంగా రైళ్లు బుక్ చేసుకొని, బస్సులు ఏర్పాటు చేసుకుని సొంతంగా అభిమానులు ముంబై చేరుకున్నారు. నిన్న ముంబైలో ఎక్కడ చూసినా చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా కనిపించింది. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించి రాజమౌళి బాలీవుడ్ మొత్తాన్ని ముక్కున వేలు వేసుకునేలా చేశాడు.