దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇతర ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, శ్రీయలు కనిపించబోతున్నారు.
ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ హీరోలతో కలిసి జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాజమౌళి.. ఇటీవల ముంబైలో గ్రాండ్గా ప్రమోషనల్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ ఈవెంట్కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ విచ్చేసి.. సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేశారు. అయితే ఈ ఈవెంట్ను లైవ్లో చూసి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చని అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయలేదు. రాజమౌళి సరికొత్త స్ట్రాటజీతో ఈ ఈవెంట్ కవరేజ్ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మేశారు. సదరు ఓటీటీ త్వరలోనే ఆర్ఆర్ఆర్ ఈవెంట్ను స్ట్రీమింగ్ చేయబోతుంది.
అయితే ఇప్పుడు ఈ విషయమే అభిమానులతో పాటు సినీ ప్రియులకూ రుచించడం లేదు. జనాలకు సినిమాను చేరువ చేయడం కోసం నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ను..సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో లైవ్ ఇవ్వాలి. అలా కాకుండా ప్రమోషనల్ ఈవెంట్ హక్కులను ఓటీటీకి అమ్మి సొమ్ము చేసుకోవడం ఏంటీ..? అసలు ఇదేం స్ట్రాటజీ..? అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ ఈవెంట్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీ బెడిసికొట్టిందని పలువురు భావిస్తున్నారు.