బాల‌య్య‌తో సినిమా.. ఆ మాట‌న్నా చిరాకే అంటున్న రాజ‌మౌళి!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి వ్యాఖ్యాత‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అటు గెస్టుల‌ను, ఇటు ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ షో నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్‌కి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి గెస్ట్‌లుగా వ‌చ్చి సంద‌డి చేశారు.

ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ షోలో బాల‌య్య మాట్లాడుతూ.. `ఇప్పటి వరకు మన కాంబినేషన్ లో సినిమా పడలేదు.. నాతో సినిమా ఎప్పుడు చేస్తారు అని ప్ర‌శ్నించారు. అందుకే రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చిరు. ఆయ‌న మాట్లాడుతూ.. `సెట్స్ మీద నా పద్ధతి విభిన్నంగా ఉంటుంది. హీరో పరిస్థితిని పట్టించుకోను.

వానకు తడుస్తున్నాడా? ఎండలో ఉన్నాడా? అనేది చూడను, నా షాట్ గురించే ఆలోచిస్తుంటాను. ఎవరైనా గుడ్ మార్నింగ్ అన్నా సరే చిరాకే వేస్తుంది. షాట్ రెడీ అయ్యేంతవరకు నా ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. ఈ పద్ధతిలో వెళ్లే నేను మిమ్మల్ని ఏవిధంగా డైరెక్ట్ చేయగలను? ఒకవేళ మీకు కోపం వస్తే… అదే నా భయం. అందుకే మిమ్మ‌ల్ని డైరెక్ట్ చేయాలంటే టెన్ష‌న్ సార్‌` అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో ఇప్ప‌డు రాజ‌మౌళి కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, రాజ‌మౌళి ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్` ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది.