టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని అపార్ట్మెంట్లో రకుల్ ఉంటున్న 12వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రకుల్ అపార్ట్మెంట్ కింద అగ్నిమాపక దళం మరియు అంబులెన్స్ ఉండటంతో.. ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, టాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ను అందుకున్న రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పుడామె అక్కడ ఎటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, మిషన్ సిండెరెల్లా చిత్రాలు చేస్తుంది. అలాగే తెలుగులో అక్టోబర్ 31 లేడీస్ నైట్, తమిళంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తుంది.
ఇదిలా ఉండగా.. మొన్నీ మధ్య రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.