మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్కు బిగ్ షాక్ తగిలింది. ఈయన నటించిన తాజా చిత్రం `రిపబ్లిక్` వివాదంలో చిక్కుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు దేవా కట్టా, సాయి తేజ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `రిపబ్లిక్`. ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిచారు.
భారీ అంచనాల నడుమ అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ని సొంతం చేసుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లోని కొల్లేరు ప్రాంత వాసుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కొల్లేరు ప్రజల జీవనస్థితిగతులకు వ్యతిరేకంగా సినిమా తీశారని.. తామంతా కొల్లేరుపై ఆధారపడి జీవిస్తుంటే.. అక్కడి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా సన్నివేశాలున్నాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.
రిపబ్లిక్ సినిమాలోని సన్నివేశాలు తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. వెంటనే సదరు సన్నివేశాలను తొలగించాలంటూ సినిమా యూనిట్ పై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.