బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్లో తన అద్భుతమైన నటనతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం `తలైవి`. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది.
సెప్టెంబరు 10న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కంగనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఈ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడంటూ ప్రశ్నించగా.. అందుకు కంగనా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో నటించాలని నాకూ ఉంది. అందుకే తనకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను ఇంకో ఛాన్స్ ఇవ్వమని తరచూ వేధిస్తుంటానని కంగనా చెప్పుకొచ్చింది.
అంతేకాదు, వీలైతే ప్రభాస్ సరసన ఇంకో సినిమా చేసే అవకాశం ఇప్పించమని కూడా ఆడుగుతుంటానని, పూరీగారి పిలుపు కోసమే ఎదురుచూస్తున్నానని ఆమె ఓపెన్గా చెప్పేసింది. కాగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన `ఏక్ నిరంజన్` సినిమాతోనే కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో బాలీవుడ్కు మకాం మార్చేసిన కంగనా..ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.