ఇద్దరు ‘రామ్’లలో ఎవరు బాగా సందడి చేశారు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాలతో వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన బుల్లితెరపై కూడా తన ప్రతాపాన్ని మరోసారి చూపించేందుకు రెడీ అయ్యాడు. గతంలో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 1’ను హోస్ట్ చేసి అందరితో శభాష్ అనిపించుకున్న తారక్, ఇప్పుడు మరోసారి వ్యాఖ్యాతగా మారుతున్నాడు. జెమినీ టీవీ ఛానల్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే గేమ్ షోకు తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఆగస్టు 22న టెలికాస్ట్ అయ్యింది.

ఈ షో ఆద్యాంతం తారక్ తన ఎనర్జీతో దుమ్ములేపేశాడు. ఇక ఈ కర్టెన్ రైజర్ షోకు గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేశాడు. ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షోలో ఈ ఆటను ఆడిన తొలి గెస్ట్‌గా రామ్ చరణ్ నిలిచాడు. అయితే ఈ షో ఆద్యాంతం తారక్ చరణ్‌కు సంబంధించిన పలు విషయాలను ప్రస్తావిస్తూ, ఆయనతో సరదాగా సందడి చేశాడు. అటు చరణ్ కూడా తారక్‌తో తనకున్న స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని ఈ షోలో నిరూపించుకున్నాడు. వీరిద్దరు ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కలిసి నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందన ఈ షో చూసిన వారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇక ఈ షో కర్టైన్ రైజర్‌లో అటు తారక్‌కు ఏమాత్రం తీసిపోకుండా చరణ్ కూడా చాలా సందడి చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దీంతో ఈ ఇద్దరు ‘రామ్’లలో ఎవరు బాగా సందడి చేశారా అనే అంశంపై సోషల్ మీడియాలో ఓటింగ్ కూడా పెడుతున్నారు అభిమానులు. అటు తారక్ ఎనర్జీకి బలంగా నిలిచాడని చరణ్‌ను పొగిడేస్తుంటే, చరణ్‌కు అండగా తారక్ నిల్చున్నాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోల్లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో ఎక్కువ సందడి చేసి ప్రేక్షకులను మెప్పించింది ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్‌లో తెలియజేయండి.