సోనూసూద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నటుడుగానే కాకుండా సమాజసేవకుడిగా దేశప్రజలందరి మనసుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయన. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆక్సిజన్ అందించడం, కరోనా పేషెంట్లకు బెడ్స్ అందించడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం ఇలా ఎన్నో విధాలుగా ఎందరికో సాయపడి రియల్ హీరో అనిపించుకున్నాడీయన.
అయితే ఇప్పుడు సోనూ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, మహారాష్ట్రలో 2022లో జరగనున్న మేయర్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరపున సోనూ సూద్ ని బరిలోకి దింపబోతున్నారని వార్తలు సైతం వస్తున్నాయి.
అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు సోనూసూద్. తాను మేయర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావడంలేదని తెలిపారు. ఓ సాధారణ వ్యక్తిగా ఎంతో ఆనందంగా ఉన్నానని సోనూ వెల్లడించారు.