ఆ యంగ్ డైరెక్ట‌ర్ కోసం రిస్క్ చేస్తున్న చిరంజీవి..?!

ప్ర‌స్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. త్వ‌ర‌లోనే యంగ్ డైరెక్ట‌ర్ బాబీతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అది కూడా తండ్రీ కొడుకులుగా చిరు న‌టించ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే గ‌తంలో చిరంజీవి.. బిర్లా రంగా, రిక్షావోడు, స్నేహం కోసం, బందిపోటు సింహం, అందరివాడు చిత్రాల్లో తండ్రి కొడుకులుగా న‌టించారు.

కానీ ఈ సినిమాలేవీ భారీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. అయితే ఇప్పుడు మ‌ళ్లీ చిరు బాబీ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు అంటే.. రిస్క్ చేస్తున్న‌ట్టే అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.