జగన్‌పై నారా లోకేశ్ కామెంట్స్ వైరల్..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్‌ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు.

సహజ వనరులను దోచుకునేందుకు గాను వైసీపీ వెనుకాడటం లేదని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను బయటపెట్టి జగన్‌ను జైలుకు పంపుతామని లోకేశ్ తెలిపారు. కాగా, జగన్‌పై లోకేశ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు గాను టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. సహజ వనరు బాక్సైట్‌ను తవ్వేస్తున్న జగన్మోహన్ రెడ్డి బంధువర్గానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు షాక్ ఇచ్చయాని, ఆ ఆదేశాలతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. జగన్, ఆయన అనుచరగణం అక్రమ మైనింగ్‌కు తెరలేపారని విమర్శించారు. అక్రమ మైనింగ్‌లో భాగస్వాములైన వారందరూ అధికారులతో సహా కటకటాల్లోకి వెళ్లడం ఖాయమని లోకేశ్ తెలిపారు.