`సాహసవీరుడు సాగరకన్య` సినిమాలో సాగరకన్యగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బసూ వంటి చిత్రాల్లో కూడా శిల్పా నటించింది. ఇక 2001లో భలేవాడివి బసూ తర్వాత శిల్పా మరే తెలుగు సినిమా చేయలేదు.
కానీ, బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. శిల్పా మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందట. అది కూడా ఇద్దరు అగ్రహీరోల సినిమాలతో. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శిల్పా శెట్టి ఓ కీలక పాత్ర పోషించనుందట.
అలాగే రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో కూడా ఓ పాత్రలో శిల్పా మెరవనుందట. ఒకవేళ ఇదే నిజమైతే..దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత శిల్పా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది.