వైసీపీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉక్కుపాదం మోపుతోంది. దీంతో వారి గుండెల్లో గుబులు మొదలైంది. ఏపీలోనే గాక పక్క రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణాల్లోనూ వైసీపీ నేతల పేర్లు ఉండటంతో.. ఇప్పుడు పార్టీలో తీవ్ర గందరగోళం మొదలైంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో జరిగిన భారీ కుంభకోణంలో తీగలు లాగితే.. వైసీపీ డొంక కదులుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్తో పాటు మరికొందరు ఈడీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో చిత్తూరు ఎంపీగా పోటీచేసిన సామాన్య కిరణ్ మెడకు కూడా ఇప్పుడు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఆమెతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా ఇప్పుడు తెగ టెన్షన్ పడుతున్నారు.
ఇప్పటికే అక్రమాస్తులు, సూట్కేసు కంపెనీల విషయంలో పీకల్లోతు మునిగిపోయిన జగన్కు గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. సామాన్య కిరణ్.. చిత్తూరు లోక్ సభ స్ధానం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయింది. ఈమె భర్త కిరణ్కుమార్ 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పశ్చిమ బెంగాల్ కేడర్. వైసీపీ అధినేత జగన్తో మంచి సంబంధాలున్నాయి. 2014ఎన్నికలకు ముందే సిలిగురి-జలపాయ్గురి అభివృద్ధి సంస్ధ అధికారిగా ఉన్న కిరణ్పై అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇటీవల ఈ కేసుకు సంబంధి ఈడీ అధికారులు బెంగాల్లో దాడి చేయడంతో ఆ లింకులు వైసీపీతో కూడా ఉన్నాయని గుర్తించారు. మొత్తం రూ.200కోట్ల స్కాం కావడంతో అధికారులు పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేయాలని సామాన్య కిరణ్ భావించారు. కానీ అనూహ్యంగా ఆమెను చిత్తూరు లోక్సభ బరిలో నిలిపారు. అయితే ఆమె ప్రచారానికి వచ్చిన నిధులపై ఇప్పుడు ఈడీ అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం ప్లానింగ్ స్టాటిస్టిక్స్ విభాగంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ఇంటిపై దాడి చేయగా పలు కీలకమైన డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఇందులో సిలిగురి-జలపాయ్ గురి కాంట్రాక్టర్లు సుమారు రూ.6కోట్లు ఇచ్చినట్లు తేలింది. అంతేగాక కాంట్రాక్టర్ల నుంచి వైసీపీ నేతలకు ఎలా నిధులు ఎలా మళ్లాయి? ఎవరెవరికి మళ్లాయి? ఎంతెంత మళ్లాయి? అనే వివరాలన్నీ దొరికాయట. దీంతో ఈ వ్యవహారంతో ముడి పడి ఉన్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.