మాణిక్యాల‌రావు మంత్రి ప‌ద‌వికి బీజేపీ ఎమ్మెల్యే ఎర్త్‌

ఏపీలో ఏప్రిల్ 6న సీఎం చంద్ర‌బాబు త‌న కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్‌తో పాటు కొత్త‌గా న‌లుగురైదుగురు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఐదుగురు మంత్రుల‌కు ఖ‌చ్చితంగా ఉద్వాస‌న ఉంటుంద‌ని కూడా టాక్‌. ఇదిలా ఉంటే బాబు కేబినెట్‌లో బీజేపీ నుంచి ఇద్ద‌రు మంత్రులుగా కొన‌సాగుతున్నారు.

వీరిలో కైక‌లూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాస్‌తో పాటు తాడేప‌ల్లిగూడెం ఎమ్మెల్యేగా ఉన్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావు మంత్రులుగా ఉన్నారు. వీరిలో కామినేనిది క‌మ్మ వ‌ర్గం కాగా మాణిక్యాల‌రావు కాపు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ఇక తాజా ప్ర‌క్షాళ‌న‌లో మ‌రో బీజేపీ ఎమ్మెల్యే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని బీజేపీ వ‌ర్గాల ద్వారా చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నార‌ట‌.

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబుపై పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నార‌ట‌. మరి ఆకుల‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలంటే ఇప్పుడు ఉన్న ఇద్ద‌రు మంత్రుల్లో ఒక‌రు బ‌య‌ట‌కు వెళ్లాలి. ఆకుల కూడా కాపు వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో ఇప్పుడు పైడికొండ‌ల‌కు ఎర్త్ త‌ప్పేలా లేదు.

మాణిక్యాలరావును తొలగించే రెండేళ్ల పాటు తనకు ఆ ఛాన్స్ ఇవ్వాలని ఆకుల బీజేపీ జాతీయ నాయ‌క‌త్వానికి కూడా విన్న‌వించుకున్నార‌ట‌. ఆయ‌న‌కు రాజ‌మండ్రికే చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు సైతం మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ట‌. మ‌రి ఆకుల ఒత్తిళ్లు ప‌నిచేస్తే పైడికొండ‌ల ప‌ద‌వికి ఎర్త్ త‌ప్పేలా లేదు.