ఏపీ టీడీపీలో కుమ్ములాటలు పీక్ స్టేజ్కి చేరిపోయాయి. నిన్న మొన్నటి వరకు చోటా నేతలు జుట్టూ జుట్టు పట్టుకని రోడ్లపై తన్నుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు పెద్ద నేతలు మేధావులు సైతం కుమ్ములాటల్లో తీరిక లేకుండా గడుపుతున్నారనే టాక్ వస్తోంది. దీనికి ఉదాహరణే నిన్న జరిగిన గుంటూరు ఘర్షణ. అది కూడా టీడీపీలో ఎంపీ స్థాయి వ్యక్తికి స్పీకర్ స్థాయి నేతకి మధ్య జరిగిన పెద్ద రగడ! దీంతో ఇప్పుడు ఈ టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. విషయంలోకి వెళ్తే.. గతంలో నరసరావుపేటని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. రిజర్వేషన్ నేపథ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో దీనిని వదులుకుని సత్తెనపల్లి నుంచి గెలిచారు.
అయినా కూడా ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రేమ చావలేదు. దీంతో ఏ కార్యక్రమమైనా ఇక్కడి నుంచే చేస్తున్నారు. దేశంలో స్వచ్ఛ నియోజకవర్గంగా నరసరావు పేటని ఆయన నిలబెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం లేకపోవడంతో టీడీపీలోని కిందిస్థాయి నేతలు దీనిని ప్రశ్నిస్తున్నారు. ఇక, కాంగ్రెస్లో ఇందిరమ్మ శకం నుంచి చక్రం తిప్పిన మేధావిగా పేరొందిన రాయపాటి సాంబశివరావు.. గత 2014 ఎన్నికల్లో విభజన నేపథ్యంలో ఆపార్టీకి గుడ్బై చెప్పి చంద్రబాబు చెంతకు చేరిపోయారు. దీంతోఆయన ఎంపీగా టీడీపీ తరఫున గెలుపొందారు.
ఇక, ఇప్పుడు ఈ ఇద్దరు నేతల మధ్య నరసరావుపేట పెను వివాదం సృష్టిస్తోంది! నరసరావుపేట మండలం పాలపాడుకు చెందిన స్థానిక నేత పులిమి రామిరెడ్డి… రాయపాటి వర్గంగా చలామణి అవుతున్నాడు. పాలపాడులో ఎంపీ నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుట్టారు.దీంతో ఆయా కార్యక్రమాలను ఎంపీ రాయపాటితో ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. వీటిని ప్రారంభించేందుకు రాయపాటి కూడా ఓకే చెప్పారు. ఈ క్రమంలో పులిమి.. రాయపాటి వర్గీయుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే ఇప్పుడు పెద్ద రగడకు దారితీసింది. ఈ ఫ్లెక్సీల్లో కోడెల కానీ, ఆయన అనుచరుల ఫొటోలు కానీ లేకపోవడంతో కోడెల వర్గం చిర్రెత్తిపోయింది.
ఈ వర్గాలు దీనిపై కోడెల తనయుడు శివరాం ప్రసాద్కి ఫిర్యాదు చేశాయి. తెర వెనుక మంత్రాంగం నడిపిన కోడెల శివరాం… రాయపాటి పర్యటన రద్దయ్యేలా చేశారు. తన తండ్రి శివప్రసాదరావుతో రాయపాటికి ఫొన్ చేయించిన శివరాం రాయపాటి పర్యటనను రద్దు చేయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రామిరెడ్డి సీరియస్ అయ్యాడు. కోడెల వర్గం వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తన భార్యతో సహా ఇంటిలోకి వెళ్లి స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. 24 గంటల్లోగా రాయపాటి అక్కడికి రాకపోతే ఆత్మహత్యకు కూడా వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు.
సమాచారం అందుకున్న రాయపాటి కుమారుడు రంగారావు హుటాహుటిన పాలపాడుకు చేరుకున్నారు. రామిరెడ్డితో చర్చలు జరిపారు. కథ ఇక్కడితో ఆగిపోయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, పులిమి.. కోడెలపై తీవ్రవిమర్శలు చేశాడు. ఫ్లెక్సీల్లో ఫొటోలు లేకుంటేనే కార్యక్రమాలు రద్దయ్యేలా చేస్తారా? అరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోడెలతో పాటు ఆయన కుమారుడు కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని అలాంటి వారిని పిలవాల్సిన అవసరం తమకు లేదని కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కోడెలకు నరసరావుపేటలో ఏం పని అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. మరి ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి ఎంపీ వర్సెస్ కోడెల వివాదం ఇప్పుడు స్టేట్ వైడ్గా సంచలనం రేపుతోంది.