`తెలంగాణలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం` అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. ముఖ్యంగా ఆయన దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది కూడా! అయితే ఇప్పుడు అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం వల్ల ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఈ నిర్ణయం ఇప్పుడు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. తమ నియోజకవర్గాల్లో ఎప్పుడు డబుల్ నిర్మాణం పూర్తవుతుందో అని.. ఆ ప్రాంత ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తుండటంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని సందిగ్ధంలో పడిపోయారట.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై `డబుల్` ఒత్తిడి పెరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గాల్లో పర్యటించిన సమయంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడిస్తారని ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారట. మొత్తం అన్ని నియోజకవర్గాల్లోని ప్రజల్లో ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా,, ఇప్పుడు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారని సమాచారం.
పైకి చెప్పకపోయినా చాలామంది ఎమ్మెల్యేల్లో ఇదే రకమైన అభిప్రాయం ఉందని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ స్థాయిలో ఒత్తిడి పెరగడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొందరు భావిస్తున్నారు. తన దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నరసన్నపేటల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గొప్పగా నిర్మించి దానిపై విస్తృతస్థాయిలో ప్రచారం చేసుకుంటున్న ఆయన… మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం వీటినిపై అంతగా దృష్టి పెట్టడం లేదనే ప్రచారం సాగుతోంది.
సీఎం సొంత మీడియాలో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రచారం జోరుగా జరుగుతుండటంతో… చాలామంది సామాన్యులు తమ ఎమ్మెల్యేలపై డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా తమ అనుచరులకైనా వీటిని మంజూరు చేయాలని కోరుతున్నట్టు టాక్. ఈ అంశంపై కేసీఆర్ను అడగలేక కేటీఆర్ వద్ద ప్రస్తావిస్తున్నారట.