టీడీపీ అధినేత చంద్రబాబుకూడా సంక్షేమం బాటపట్టారు. ఇటీవల జరిగిన రెండు రోజుల మహానాడులో చివరిరోజు ఆయన సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్కరించారు. దీంతో సంక్షేమం విషయంపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించగా.. అసలు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిలదేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.
దీంతో సంక్షేమ ఎవరి పేటెంట్? అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు సేవ చేస్తామని చెబుతారు. కాబట్టి.. ఈ సేవలో సంక్షేమం అనేది ఒక అంతర్భాగం. కొందరు దీనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. మరికొందరు తక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. గతంలో వైఎస్ కూడా సంక్షేమ పాలన అంటూ.. ముందుకు సాగారు. తర్వాత.. వచ్చిన చంద్రబాబు(2014) సంక్షేమం, అభివృద్ధి అంటూ.. ముందుకు సాగారు.
అయితే.. 2019లో వచ్చిన జగన్పూర్తిగా సంక్షేమ పాలన అంటూ.. మేనిఫెస్టోను రూపొందించి..దానినే అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా..(ఓవర్గం) ఆయనకు కనెక్ట్ అయ్యారు. దీంతో చంద్రబాబు కూడా.. తన రూటు మార్చుకుని.. సంక్షేమానికి పెద్దపీట వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ .. సహజమని.. కేవలం ఒకరికే ఏదీ పరిమితం కాదని.. ఎవరూ పేటెంట్కు అర్హులు కాదని చెబుతున్నారు.
అలా అనుకుంటే.. ఐటీకి పెద్దపీట వేసిన చంద్రబాబు అభివృద్ది దిశగా ముందుకు వెళ్లారు. మరి జగన్ దీనిని వదిలేశారా? అంటే.. లేదు కదా.. తాము కూడా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తు న్నామని చెబుతున్నారు కదా! మరి అభివృద్దికి తానే పేటెంట్ అని చంద్రబాబు అంటే.. జగన్ ఏం చెబుతారు? అనని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నవారు అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారని.. అయితే.. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువని చెబుతున్నారు.