కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ సైతం తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూత పడటం, సినిమాల విడుదల ఆగిపోవడం ఇలా ఎన్నో విధాలుగా సినీ పరిశ్రమ అతలాకుతలం అయింది. ఇక ఇప్పుడిప్పుడే కరోనా జోరు తగ్గుతుండడంతో.. షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యాయి. థియేటర్లూ తెరుచుకోవడంతో.. సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి.
అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తైనా కొన్ని కొన్ని చిత్రాలకు రిలీజ్ డేటే దొరక్క తెగ సతమతమవుతున్నాయి. మరి ఇంతకీ ఆ సినిమాలు ఏవేవో ఓ లుక్కేసేయండి.
ఖిలాడి: రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, ఇప్పటికీ ఈ సినిమాకు విడుదల తేదీ దొరకలేదు.
అఖండ: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ చిత్రాన్ని మే 28న విడుదల చేయాలనుకున్నా.. కరోనా అడ్డుపడింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మేకర్స్ రిలీజ్ డేట్ను వెతికే పనిలో పడ్డారు.
విరాట పర్వం: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పటికీ ఈ సినిమాకు విడుదల తేదీ దొరకలేదు.
దృశ్యం 2: దృశ్యంకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, మీనా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయి చాలా రోజులు అవుతుంది. కానీ దీని రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.
థ్యాంక్యూ: నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబోలో తెరకెక్కిన థ్యాంక్యూ చిత్రంలో రాశీఖన్నా,మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. కానీ, విడుదల తేదీ మాత్రం అనౌన్స్ చేయలేదు.