ప్రముఖ కోలీవుడ్ హీరోగా టాలీవుడ్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ సినిమా సక్సెస్ ని ఆయన ఆస్వాదిస్తున్నారు. తదుపరి వరుస చిత్రాలతో తన కెరియర్ ను బిజీగా కొనసాగించే పనిలో పడ్డారు. ఇకపోతే శ్రీలంక క్రికెటర్ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను 800 అనే పేరుతో చేయాల్సి ఉండగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుండి అనూహ్యంగా తప్పుకున్నారు ఇకపోతే ఇలా ఉన్నట్టుండి తప్పుకోవడం వెనుక కారణాన్ని క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో ముత్తయ్య మురళీధరన్ స్వయంగా మాట్లాడుతూ ఏం జరిగిందో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. నేను ఐపీఎల్ లో ఉన్నప్పుడు విజయసేతుపతి షూటింగ్ కోసం అదే హోటల్లో బస చేసినట్లు తెలిసింది. ఆయన నాతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు. మొదట్లో విషయం ఏమిటో తెలియక పోయినప్పటికీ విజయ్ సేతుపతి క్రికెట్ కి అభిమాని అయినందుకు ఆయనను కలవడానికి అంగీకరించాను. అతను ఐదు రోజులపాటు రెండు గంటలు చొప్పున కేటాయించగా ఇద్దరం ఎన్నో విషయాలను మాట్లాడుకున్నాము.
తర్వాత స్క్రిప్ట్ వివరణ కోసం రాత్రి 8 గంటలకు కలిసే వాళ్ళము. ఇక స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన నుంచీ ఈ చిత్రంపై ఉత్సాహం వ్యక్తం అయింది. అలాంటి అపూర్వమైన అవకాశాన్ని వదులుకోనని ప్రాజెక్టులో భాగం కావడానికి ఆసక్తిగా ఉన్నానని సేతుపతి తెలిపారు. ఇక వెంటనే మేము ఒప్పందం కుదుర్చుకున్నాము. ప్రొడక్షన్ హౌస్ కూడా సిద్ధమయ్యింది. అయితే రాజకీయ నాయకుల విపరీతమైన వ్యాఖ్యల కారణంగా విజయ్ సేతుపతి ఈ బయోపిక్ లో నటించకూడదని నిర్ణయించుకున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన విపరీతమైన ఒత్తిడికి లోనయ్యారు. కుటుంబాన్ని కూడా బెదిరించారు. ఈ చిత్రం స్పోర్ట్స్ మూవీ ఇది.. రాజకీయాలు చేయడమో లేదా మరో ఇతర కంటెంట్తో తెరకెక్కేది కాదు. కేవలం ఒక ఆటగాడి నిజమైన జీవిత కథ.. కానీ సినిమా కారణంగా విధ్వంసం చేయడం నచ్చదు ఆయన కెరియర్ ముఖ్యం కదా అందుకే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ క్రికెటర్ వెల్లడించారు.