తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చకచక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ అధినేత చంద్రబాబు అటు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో శ్రీకాకుళం – విజయవాడ – గుంటూరు ఎంపీలు మాత్రమే దక్కాయి. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలలో కేశినేని నాని, గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేస్తారా చేయరా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి.
ఈసారి 20 కు పైగా లోక్సభ నియోజకవర్గాలలో పార్టీ తరఫున కొత్త అభ్యర్థులు రంగంలోకి దిగటం దాదాపు ఖరారు అయింది. ఈ క్రమంలోనే ఈసారి లోక్సభ సీట్లలో బీసీల ప్రాధాన్యత పెంచనున్నారు. బీసీలలో బలమైన గౌడ – యాదవ – తూర్పు కాపు – కొప్పుల వెలమ – బోయ – కురుబ లాంటి సామాజిక వర్గాలకు కూడా తప్పనిసరిగా లోక్సభ సీట్లలో ప్రాధాన్యం ఉండేలా చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కూడా ఈసారి లోక్సభ అభ్యర్థిత్వం ఒక యువనేతకు దక్కనుంది. విజయవాడ – గుంటూరు – విశాఖపట్నం – నరసరావుపేట లాంటి లోక్సభ సీట్లలో ఈసారి కూడా పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గం నేతలే పోటీ చేయనున్నారు. ఇక ఒంగోలు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం సీట్లు రెడ్డి నేతలకు ఇవ్వనున్నారు.
ఇక ఈసారి బీసీ సమీకరణలలో భాగంగా బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గం నుంచి మచిలీపట్నంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మరోసారి పోటీ చేయనున్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి శ్రీకాకుళం బరిలో రామ్మోహన్ నాయుడు మూడోసారి రంగంలో ఉండమన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఈసారి విజయనగరం నుంచి అసెంబ్లీ బరిలో దిగటం ఖరారు కావడంతో విజయనగరం ఎంపీగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను రంగంలోకి దించుతున్నారు. ఇక యాదవ సామాజిక వర్గం నుంచి గత ఎన్నికలలో నెల్లూరులో సీనియర్ నేత బీద మస్తాన్రావు పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి టీడీపీ నుంచి ఏలూరు లోక్సభకు ప్రముఖ పారిశ్రామికవేత్త గోరుముచ్చు గోపాలరావు యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. రాజమండ్రి ఓసీలకు ఇచ్చిన పక్షంలో ఏలూరు కచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి కేటా ఇస్తారని బలంగా ప్రచారం జరుగుతుంది. ఇక రాజమండ్రి లోక్సభ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యువ పారిశ్రామికవేత్త శిష్టా లోహిత్ పేరు దాదాపు ఖరారు అయినట్టు చెబుతున్నారు.
ఇక హిందూపురం లోక్సభ సీటు నుంచి కురుబ లేదా బోయ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఎవరో ఒకరు రంగంలోకి దిగే ఛాన్సులు అయితే ఉన్నాయి. నిమ్మల కిష్టప్ప ఈసారి లోక్సభకు పోటీ చేస్తారా లేదా అసెంబ్లీ బరిలో ఉంటారా ? హిందూపురం సీటు ఈ రెండు వర్గాలలో ఎవరికి దక్కుతుంది అన్నది కూడా ఆసక్తిగా మారింది.