నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2015లో విడుదలైన `అఖిల్` మూవీతో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అఖిల్ ను నిరాశపరిచాయి. అయితే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` మాత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది. కమర్షియల్ గా హిట్ అయింది.
అయితే ఇంతలోనే ఏజెంట్ రూపంలో అఖిల్ ఖాతాలో భారీ డిజాస్టర్ పడింది. ప్రస్తుతం అఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. ఇదంతా పక్కన పెడితే.. అఖిల్ ఏడాది వయసులోనే `సిసింద్రీ` మూవీలో నటించాడన్న సంగతి తెలిసిందే. 1995లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇందులో నాగార్జున, టబు, ఆమని, శరత్ బాబు కీలక పాత్రలను పోసించారు. అయితే సిసింద్రీ కాకుండా అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మరో సినిమా చేశాడని మీకు తెలుసా..?
ఇంతకీ ఈ మూవీ మరేదో కాదు.. సంతోషం. కొండపల్లి దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున హీరోగా కాగా.. శ్రియా, గ్రేసీ సింగ్ హీరోయిన్లు. 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున కుమారుడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అక్షయ్ బచ్చును అంత త్వరగా ఎవరూ మర్చిపోలేదు.
అయితే మొదట ఆ పాత్ర కోసం నాగార్జునను అతి కష్టం మీద ఒప్పించి అఖిల్ ను తీసుకున్నాడట దశరథ్. అఖిల్, నాగార్జున కాంబోలో వారం రోజులు షూటింగ్ కూడా జరిగిందట. కానీ, ఆ తర్వాత అఖిల్ కు ఫుల్ గా ఫీవర్ వచ్చేసిందట. రెండు రోజుల్లో తగ్గిపోతుందని అనుకున్నా.. పది రోజులైనా తగ్గలేదుట. దాంతో చేసేదేమి లేక దశరథ్ అఖిల్ ప్లేస్ ను అక్షయ్ బచ్చుతో రీప్లేస్ చేశారు.