ఇండియన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన సతీమణి సాక్షి సింగ్ నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై తొలి సినిమాగా లెట్స్ గెట్ మ్యారీడ్ (ఎల్జీఎం)ను నిర్మించారు. రమేశ్ తమిళ్మని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, లవ్టుడే ఫేం ఇవానా జంటగా నటిస్తున్నారు. ఇందులో నదియా కీలక పాత్రను పోషించింది.
అత్తాకోడళ్ల మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథ ఇది. జూలై 28న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ధోని, సాక్షి దంపతులు హీరోహీరోయిన్లతో ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాకు మరింత హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న సాక్షి.. తన ఫేవరెట్ హీరో ఎవరో వెల్లడించింది.
ఇంతకీ సాక్షి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. మన తెలుగోడే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాను అల్లు అర్జున్ కు వీరాభిమానినని, అతడు నటించిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో చూశానని సాక్షి స్వయంగా వెల్లడించింది. ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో.. బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. నిజానికి పుష్ప కంటే ముందే అల్లు అర్జున్ సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపదించుకున్నాడు. ఈయన సినిమాలు ఇతర భాషల్లో డబ్ అయ్యి యూట్యూబ్ లో విడుదల అవ్వడం వల్ల బన్నీకు నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పుష్పతో బన్నీ క్రేజ్ ట్రిపుల్ అయింది.