ఏపీలో అధికార వైసీపీకి నిదానంగా షాకులు పెరుగుతున్నాయి. ఆ పార్టీలో కొందరు నాయకుల మధ్య జరిగే ఆధిపత్య పోరుతో పార్టీని కొందరు నేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలా స్థానాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో శ్రీకాళహస్తిలో కూడా పంచాయితీ నడుస్తుంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కొందరు వైసీపీ నేతలకు పొసగడం లేదు.
ఈ క్రమంలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు బయటకొచ్చేస్తున్నారు. తాజాగా ఆయన టిడిపి అధినేత చంద్రబాబుని కలిశారు. త్వరలోనే టిడిపి తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం. అయితే పార్టీలో చేరి పనిచేశాక..కీలక పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మొదట్లో నాయుడు టిడిపిలోనే పనిచేశారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేశారు. తర్వాత నాయుడు టీడీపీని వీడాక 2004లో కాంగ్రెస్ తరపున శ్రీకాళహస్తి నుంచీ పోటీ చేసి గెలుపొందారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలో చేరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే నాలుగేళ్ళుగా అధికార పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో ఇపుడు వైసీపీని వీడి టిడిపిలోకి వస్తున్నారు.
అయితే కాళహస్తిలో కొంతమేర ఓటు బ్యాంకు ఉన్న నాయుడు..వైసీపీని వీడటం ఆ పార్టీకి కాస్త నష్టమే అని చెప్పవచ్చు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే మధుసూదన్ పై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ వాళ్ళు ఆయనకు షాక్ ఇస్తున్నారు.