ప్రముఖ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె మూడో మాజీ భర్త పీటర్ పాల్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీటర్.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. పీటర్ తో విడిపోయినప్పటికీ.. అతడి మరణంపై వనిత విజయ్ కుమార్ సంతాపం ప్రకటించింది.
దీంతో `వనిత మూడో భర్త మృతి` అంటూ అన్ని న్యూస్ ఛానెళ్లు, పేపర్లు, వెబ్ సైట్స్ వార్తలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో తాజాగా వనిత విజయ్ కుమార్ పీటర్ నా మూడో భర్త కాదు అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. పీటర్ పాల్తో తనకు న్యాయబద్ధంగా పెళ్లి జరగలేదని,2020లో కొన్ని రోజులపాటు తాము రిలేషన్షిప్లో ఉన్నామని, అది ఆ సంవత్సరమే ముగిసిందని వనిత వెల్లడించింది.
తాను ఆయన భార్యని కాదని, అతను తన భర్త కాదని స్పష్టం చేసింది. `వనిత విజయ్ కుమార్ భర్త చనిపోయాడు` అంటూ రాస్తున్న వార్తలను ఇకపై ఆపేయాలని కోరింది. అలాగే తాను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాని కూడా తెలిపింది. ఈ మేరకు వనిత సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పెట్టింది. కాగా, వనిత మొదట ఆకాష్ అనే వ్యక్తిని 2000లో పెళ్లి చేసుకుని.. 2007లో విడిపోయింది. అదే ఏడాది ఆనంద్ జయరాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2012లో అతనితో విడిపోయారు. ఇక ముచ్చటగా మూడోసారి 2020లో పీటర్ని పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు వనిత సోషల్ మీడియాలో పంచుకుంది. కానీ, ఇప్పుడు అతడితో తనుకు పెళ్లే కాలేదని అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది.