ప్రస్తుత రోజుల్లో సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే థియేటర్లు కలకల్లాడుతున్నాయి. పొరపాటున టాక్ అటు ఇటుగా ఉంటే.. ప్రేక్షకులను ఆ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కానీ, డిజాస్టర్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబట్టిన స్టామినా కేవలం మెగాస్టార్ చిరంజీవికే సొంతం.
చిరు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన చిత్రాల్లో `మృగరాజు` ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. రంభ స్పెషల్ లో మెరిసింది. చిరంజీవి తమ్ముడు నాగబాబుతో పాటు ప్రకాష్ రాజ్, సంఘవి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చాడు.
యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2001లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజే వెంకటేష్ `దేవి పుత్రుడు`, బాలకృష్ణ `నరసింహ నాయుడు` చిత్రాలు రిలీజ్ అవ్వగా.. బాలయ్య సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. మిగిలిన రెండు సినిమాలకు డిజాస్టర్ టాక్ లభించింది. అయితే ఫ్లాప్ టాక్ తోనే మృగరాజు అనేక సెంటర్లలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా రూ. 14 కోట్ల షేర్ రాబట్టింది. అప్పట్లో ఇదొక రికార్డు అనే చెప్పాలి.