సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, మురళి మోహన్, జయ సుధ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు హాజరై ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ ‘షూటింగ్ సెట్లో నాతో సహా ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ గుర్తు చేసుకునే ఏకైక నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన్ని ఇంట్లో కలిసాను. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు స్వయంగా ఆయనే నాకు బ్రేక్ఫాస్ట్ వడ్డించారు. అది నా జీవితంలోనే మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం.’ అని రామ్ చరణ్ చెప్పారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ఎన్టీఆర్తో నాకు ప్రత్యేకంగా పరిచయం లేదు. కానీ ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఒక నాయకుడు, ఓటరు ఎలా ఉండాలి? తల్లి, కొడుకుల బంధం ఎలా ఉండాలి? అనే విషయాలను ఎన్టీఆర్ ని చూసి నేర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తి గురించి రాబోయే తరాల వారు కూడా తెలుసుకోవాలి. ఎన్టీఆర్ గురించి విని స్ఫూర్తి చెందాలి.’ అని అన్నాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన గొప్పతనం వల్లే 75 ఏళ్లుగా ఆయన మాట వింటున్నాం. ఎన్నో కోట్ల మంది ప్రజల గుండెలపై ఆయన సంతకం చేసి వెళ్ళిపోయారు. దర్శకుడిగా నా కెరీర్ మొదలైనది కూడా ఆయన పేరుతో ఉన్న నిర్మాణ సంస్థతోనే. ఆయన నటనను చూసే అదృష్టం నాకు లేకపోయినా ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.’ అని అనిల్ రావిపూడి తెలిపారు.