రామోజీరావు ఆఫర్‌ను కాదన్న ఎన్టీఆర్.. కారణం ఇదే

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఎన్టీఆర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఆయనతో డ్యాన్స్‌ అంటే హీరోయిన్లు వెనుకంజ వేస్తుంటారు. ఆయనతో పాటు డ్యాన్స్ చేయాలంటే చాలా నైపుణ్యం ఉండాలి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఆయన నటనా లక్షణాలన్నీ తారక్ పుణికిపుచ్చుకున్నాడు. మరింతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇక సినిమాలతో పాటు ఆయన గతంలో బిగ్ బాస్ తొలి సీజన్‌కి హోస్ట్ గా వ్యవహరించాడు. తనలోని మరో నైపుణ్యాన్ని అందరికీ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఇప్పటికి ఎంత మంది హోస్ట్ లు వచ్చినా ఎన్టీఆర్ చేసిన హోస్టింగ్‌కే ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు. ఇదే తరహాలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోను జెమిని టీవీ వాళ్లు ఆయన హోస్ట్ గా ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లో బిజీ కావడంతో ఆ షో ఆగిపోయింది. ఆయన స్థానంలో మరో హీరోను హోస్ట్ గా పెట్టలేక ఆ షోను నిలిపి వేసినట్లు సమాచారం.

ఇక మీడియా రంగంలో అగ్రగణ్యుడైన రామోజీరావు కొన్నాళ్ల క్రిందట ఈటీవీ విన్ యాప్‌ను ప్రారంభించారు. దానిని మరింత ప్రమోట్ చేసేందుకు ఇటీవల కొన్ని సినిమాలను నేరుగా అందులో విడుదల చేస్తున్నారు. ఇటీవలే రవిబాబు దర్శకత్వం వహించిన అసలు సినిమా ఇందులో స్ట్రీమింగ్ అయింది. ఇదే తరహాలో ముందు ముందు మరిన్ని సినిమాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ హోస్ట్ గా ఓ టీవీ షోను ప్రారంభించాలని రామోజీరావు తలంచారు.

ఎన్టీఆర్‌కు కళ్లు చెదిరే ఆఫర్‌ను అందించారు. అయితే ఆ ఆఫర్‌ను సుతిమెత్తగా వద్దని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా శరవేగంగా సెట్స్ పైకి వెళ్తోంది. ఓ వైపు సినిమాలు, మరో వైపు టీవీ షోలు బ్యాలెన్స్ చేయలేనని ఆయన రామోజీరావుకు చెప్పినట్లు సమాచారం. అయితే బుల్లితెరపై హోస్ట్ గా కూడా ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఏ షో చేసినా దానికి ప్రత్యేక వన్నె తెస్తాడనడంలో సందేహం లేదు.