యంగ్ బ్యూటీ కృతి శెట్టి గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు తన ఆశలన్నీ `కస్టడీ` పైనే పెట్టుకుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇందులో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తే.. శరత్బాబు, ప్రియమణి తదితరులు కీలకపాత్రలను పోషించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. కస్టడీకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
షూటింగ్ అనుభవాలను, నాగచైతన్యతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంది. గతంలో వీరిద్దరూ `బంగార్రాజు` చిత్రంలో నటించారు. నాగచైతన్య, కృతి శెట్టి నటించిన రెండో సినిమా ఇది. నాగచైతన్యతో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతమైన అనుభవమని, ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా ఉంటుందని కృతి శెట్టి పేర్కొంది. అలాగే కస్టడీ కథ యూనిక్గా ఉంటుందని.. ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందని కృతి శెట్టి ధీమా వ్యక్తం చేసింది. మరి ఈ సినిమాతో అయినా బేబమ్మ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.