మరో ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యర్ధులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి బిఆర్ఎస్ పార్టీ సులువుగా గెలవడం కష్టమే. ఆ పార్టీ ఇంకాస్త కష్టపడాల్సి ఉంది. పైగా కాంగ్రెస్, బిజేపిలు వేగంగా పుంజుకుంటున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కేసిఆర్ గెలవడం కోసం సరికొత్త వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. వారికి మళ్ళీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమే. కానీ వారికి సీట్లు లేవని చెబితే వారు వేరే పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేసిఆర్ తెలివిగా..సిట్టింగులు అందరికీ సీట్లు ఇస్తామని ప్రకటించారు. దీని ద్వారా సిట్టింగులకు సీట్లు ఖాయమనే విధంగా ప్రకటన చేసి..ఎమ్మెల్యేల జంపింగులకు బ్రేకులు వేశారు.
అయితే అందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే బిఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ తప్పదు. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. అలాంటి వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం. ఇక అలాంటి వారికి ఎన్నికల ముందు కేసిఆర్ చెక్ పెట్టేలా ఉన్నారు. ఎన్నికల సమయంలో వారికి సీట్లు నిరాకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఎవరైతే పనితీరు బాగోలేదని భావిస్తున్నారో వారు..ఇప్పుడు దూకుడుగా పనిచేయడం కూడా మొదలుపెట్టారు. అంటే ఈ ఆరు నెలల్లో బాగా పనిచేసి ప్రజా మద్ధతు పెంచుకుంటే..సీటు ఖాయమవుతుందని భావిస్తున్నారు. కానీ ఏదేమైనా కొంతమందికి సీట్లు ఇవ్వడం కష్టమే అని తెలుస్తుంది.