ఏపీ బీజేపీలో పొత్తు అంశంపై రచ్చ నడుస్తోంది..జనసేనతో పొత్తుకు కాలం చెల్లినట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల తర్వాత బిజేపి-జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు పెట్టుకున్నాయి గాని ఏనాడూ కూడా వారు కలిసి పనిచేయలేదు. పదే పదే కలిసి పనిచేద్దామని పవన్ పిలుపునిచ్చిన ఏపీ బిజేపి నేతలు ముందుకు రాలేదు. ఆ విషయాన్ని పవన్ పలుమార్లు చెప్పారు.
కేంద్రంలో ఉన్న నాయకులు సహకరిస్తున్నారు గాని..రాష్ట్రంలో ఉన్న నాయకులు సహకరించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు..కానీ వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చింది. అయితే ప్రత్యక్షంగా బిజేపికి మద్ధతు తెలపలేదు. బిజేపి కూడా మద్దతు అడిగినట్లు కనిపించలేదు. దీంతో క్షేత్ర స్థాయిలో జనసేన నాయకులు బిజేపికి సపోర్ట్ ఇవ్వలేదు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజేపి దారుణంగా ఓడిపోయింది. చెల్లని ఓట్లు కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మాధవ్ తాజాగా జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇంకా జనసేనతో పొత్తు లేనట్లే అని, అసలు జనసేన ఏ మాత్రం సహకారం అందించలేదని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఇంచుమించు మాధవ్ వ్యాఖ్యలని సమర్ధించారు. కాకపోతే పొత్తు లేనట్లే అనేది చెప్పలేదు.
బీజేపీ-జనసేన విడిపోతాయని చెప్పనంటూ సోము పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాగే మీ కోరిక ఫలించదంటూ మీడియా ప్రతినిధుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే టిడిపితో పొత్తుకు రెడీగా లేని బిజేపితో జనసేనకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది. అదే సమయంలో మూడు పార్టీల పొత్తు లేకపోతే బిజేపి నుంచి చాలామంది నేతలు జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు సమయం కోసం ఎదురుచూస్తున్నారు.