పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదేపదే చర్చకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తుంటారు.
అయితే తొలిసారి తన మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల ఆయన నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే`లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా ఫస్ట్ పార్ట్ ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. ఈ షోలో బాలయ్య `ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా..?` అని ప్రశ్నించగా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాట్లాడుతూ.. `నేను అస్సలు జీవితంలో పెళ్లి చేసుకోవాలనుకోలేదు. బ్రహ్మచారిగా ఉండిపోవాలి అనుకున్నా. కానీ, అలా జరగలేదు. మొదటి సంబంధం ఇంట్లో వాళ్లు చూశారు. రిలేషన్ షిప్లో కొన్ని కుదరలేదు కాబట్టి మొదటి భార్యతో విడిపోయా. రెండో సారి చేసుకున్నప్పుడు కూడా అభిప్రాయ భేదాల్లాంటివి వచ్చాయి. అందుకే విడిపోవాల్సి వచ్చింది. అందరూ మూడు పెళ్లిళ్లు అంటుంటే, ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదురా బాబూ. ముగ్గురితో ఒకేసారి ఉండలేదు. నేను కోరికతోనో, వ్యామోహంతోనో చేసుకోలేదు. అలా జరిగాయి అంతే. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శించడానికి అది ఒక ఆయుధం అయింది. నన్ను తిట్టడానికి వాళ్ళకి నాలో ఇంకేమీ లేదు. అందుకే ఈ పాయింట్ తీసుకుని తిడుతుంటారు. నేను కూడా వాళ్ళని తిరిగి తిట్టొచ్చు. కానీ నాకు సంస్కారం ఉంది` అంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. దీంతో పవన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.