మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతి హాసన్, కేథరిన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తే.. బాబీ సింహా, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
పూనకాలు లోడింగ్ అనే క్యాప్షన్ తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో చిరంజీవి సవతి తల్లి తనయుడిగా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. రవితేజ రాకతో సెకండాఫ్ మొదలవుతుంది. చిరు, రవితేజ టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. విక్రమ్ పాత్రని ముగించి..వీరయ్యకు కొత్త లక్ష్యం నిర్దేశించడం దగ్గర ఎమోషన్ బాగా పండుతుంది. మొత్తానికి వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్ర ఒక హైలెట్గా నిలిచింది.
అయితే వాల్తేరు వీరయ్య సినిమా చూసిన కొందరు మెగా ఫ్యాన్స్ కి ఇందులో రవితేజ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉంటే అన్నదమ్ముల సెంటిమెంట్ ఇంకా వర్కవుట్ అయ్యేదని భావిస్తున్నారు. నిజానికి రవితేజ పాత్ర కోసం బాబీ మొట్ట మొదల పవన్ కళ్యాణ్నే అనుకున్నారట. కానీ, సినిమాలో రవితేజ పాత్ర చనిపోతుంది. అటువంటి పాత్ర కోసం పవన్ ను తీసుకుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో, సినిమాకే రిస్క్ అని చిరంజీవి డైరెక్టర్ బాబీతో వద్దు అన్నాడట. దాంతో ఫైనల్ గా రవితేజ ను తీసుకున్నారని అంటున్నారు.