ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని భాసల్లోనూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా `పుష్ప ది రూల్` టైటిల్ తో పార్ట్ 2 రాబోతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ డైలాగ్ లీక్ అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ డైలాగు ఏమిటంటే.. `అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం`. మరి ఈ డైలాగు నిజంగా సినిమాలో ఉందో లేదో కానీ.. ఫ్యాన్స్ కు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోంది. దీంతో ఈ డైలాగ్ ను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.