బాబుకు సీటు ఫిక్స్ చేసిన పెద్దిరెడ్డి..కుప్పం వదిలేసినట్లే!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ బెదిరింపులతోనో..పథకాలు పోతాయని భయం తెప్పించడమో..లేక పలు రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించుకుని..కుప్పంలో కొంతమంది టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు.

అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అయితే ఇలా వైసీపీ వన్ సైడ్‌గా గెలిచింది…మరి ఇది ఎలాంటి గెలుపు అనేది కుప్పం ప్రజలకు కూడా బాగా తెలుసు. ఇక ఈ గెలుపుతోనే కుప్పంలో నెక్స్ట్ తామే గెలుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆఖరికి జగన్ సైతం..కుప్పంలో అన్నీ ఎన్నికలు గెలిచాం..కాబట్టి ఈ సారి కుప్పం అసెంబ్లీలో కూడా గెలుస్తామని, అలాగే 175 సీట్లు గెలుస్తామని అంటున్నారు.

అంటే కుప్పంపై వైసీపీ బాగా కాన్ఫిడెన్స్‌తో ఉంది..కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉందని చెప్పవచ్చు. అయితే పరిస్తితులు మారుతున్న నేపథ్యంలో బాబు కూడా కుప్పంపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. అయినా సరే వైసీపీ ఎక్కడా తగ్గకుండా కుప్పం కోటని బద్దలగొట్టాలని చూస్తుంది. ఇదే క్రమంలో ఈ సారి బాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఈ సారి కుప్పం కాకుండా మరోసీటులో పోటీ చేస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా అనంతపురం వైసీపీ బలోపేతంపై సమావేశాలు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి..తాజాగా కళ్యాణదుర్గంలో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే బాబు నెక్స్ట్ కుప్పంలో ఓడిపోతారని, అందుకే ఈ సారి వేరే స్థానానికి వెళ్తారని, ఈ సారి కళ్యాణదుర్గంలో పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని, ఇక్కడ పోటీ చేసిన ఓడిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. అంటే బాబు ఎక్కడ పోటీ చేస్తారో పెద్దిరెడ్డి చెప్పేస్తున్నారు. మరి ఇది పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉంది. పెద్దిరెడ్డి చెప్పినట్లు జరుగుతుందో లేదో చూడాలి.