టీడీపీ కండువాతో రాము..సీటు నాదే అంటున్న రావి..!

గుడివాడ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి..అందులోనూ టీడీపీలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ శ్రేణులు చాలా కసితో ఉన్నాయి. ఆయన్ని ఓడించి తీరాలని పనిచేస్తున్నాయి. బలమైన నాయకుడుని ముందు పెట్టి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే టీడీపీలో సీటు కోసం పోటీ పెరిగిపోతుంది.ఇప్పటికీ గుడివాడలో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ రావట్లేదు.

ప్రస్తుతానికి ఇంచార్జ్‌గా  రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. అదే సమయంలో అటు పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీలు సైతం ఉన్నారు. ఇదే క్రమంలో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము రంగంలోకి దిగారు. ఇక ఈయనకే సీటు అని ప్రచారం జరుగుతుంది. కానీ రాము..సొంతంగా గుడివాడలో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా ముందుకెళుతున్నారు. ఇలా పార్టీతో సంబంధం లేకుండా ముందుకెళుతున్న రాము..తాజాగా బాంబు పేల్చారు.

టీడీపీ కండువా తిరగడం మొదలుపెట్టారు.  “అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయం కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో స్థాపించబడినటువంటి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా అందరితో కలిసి పనిచేయటానికి ఒక కార్యకర్తగా ముందుకు వచ్చాను” అని చెప్పి టీడీపీలో యాక్టివ్‌గా తిరగడం మొదలుపెట్టారు. అలాగే రావి, పిన్నమనేనిలతో కలిసి పనిచేస్తానని అంటున్నారు. దీంతో సీటు విషయంలో కన్ఫ్యూజన్ పెరిగింది.

దీంతో రావి వెంటనే స్పందిస్తూ..సీటు తనదే అని, కొడాలిని ఓడించేది తానే అని అంటున్నారు. అలాగే రాముని తానే ఆహ్వానించానని, అంతా కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. అయితే కమ్మ వర్గానికి చెందిన రాము..ఆర్ధికంగా స్ట్రాంగ్..అటు ఆయన భార్య ఎస్సీ వర్గానికి చెందినవారు. దీంతో గుడివాడలో కొడాలికి ఫుల్ సపోర్ట్ ఉన్న ఎస్సీ వర్గాన్ని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రాముకు సీటు ఇస్తారని ప్రచారం ఉంది. కాదు కాదు రావి చాలాసార్లు త్యాగం చేశారని, ఆయనపై సానుభూతి ఉందని, ఆయనకే సీటు ఇస్తారని అంటున్నారు. మరి చివరికి చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారో చూడాలి.