కడప జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి..టీడీపీలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన..జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్ అవినీతితోనే పాలన మొదలుపెట్టారని, ఇక రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకే సాధ్యమని, బాబు-పవన్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరుపున మైదుకూరులో పోటీ చేస్తానని డీఎల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కడప జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
మైదుకూరు నుంచి కాంగ్రెస్ తరుపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీఎల్..రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు కాస్త దూరం జరిగారు. ఇక 2019 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి..మైదుకూరులో పోటీ చేయాలని ఆశించారు. కానీ చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో డీఎల్ వైసీపీలో చేరి..మైదుకూరులో వైసీపీ గెలుపుకు సహకరించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక డీఎల్ని వైసీపీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇటు డీఎల్ సైతం వైసీపీలో యాక్టివ్ గా లేరు.
ఇదే క్రమంలో జగన్ పాలనపై విమర్శలు చేసిన డీఎల్..టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని అర్ధమైంది. గుర్తింపు పొందిన పార్టీలు చాలా ఉన్నాయి. కానీ గెలవడం జరగదు. టీడీపీలోకి వస్తేనే కాస్త పాజిబిలిటీ ఉంది. పైగా పవన్ కూడా కలుస్తారని ఆశిస్తున్నారు. అందుకే ఆయన టీడీపీలో చేరి..మైదుకూరు సీటు కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది.
కానీ మైదుకూరు టీడీపీ బాధ్యతలు పుట్టా సుధాకర్ యాదవ్ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనే రెండుసార్లు వరుసగా ఓడిపోయారు. ఈ సారి మాత్రం ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయి. పైగా మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. ఈ క్రమంలో మైదుకూరులో టీడీపీ గెలుపుకు ఛాన్స్ ఉంది. మరి డీఎల్ వస్తే సీటు ఆయనకు ఇస్తారా లేక పుట్టానే మళ్ళీ బరిలో దించుతారా? అనేది సస్పెన్స్గా మారింది.