రాజకీయాల్లో ఏ చిన్న కారణమైనా కావొచ్చు.. నాయకులను తెరచాటుకు నెట్టేస్తుంది. ఇది సహజం కూడా. గత ఎన్నికలకు ముందు కూడా వైసీపీ చాలా మంది నాయకులు టికెట్లుతెచ్చుకోలేక పోవడానికి ఇదే కారణంగా మారింది. చిన్న చిన్న కారణాలతో టికెట్లు పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు కూడా ఎదురవుతుందనే వాదన వినిపిస్తోంది.
నిజానికి గత ఎన్నికలకు ముందు వరకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో ఉన్నారు. అనూహ్యంగా ఆయన వైసీపీ పంచన చేరి మైలవరం టికెట్ను సొంతం చేసుకున్నారు. గెలుపు గుర్రం ఎక్కారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినా అది దక్కలేదు. అయితే, మంత్రి పదవి దక్కక పోవడంపై కేపీకి ఎలా ఉన్నప్పటికీ.. ఆయన తండ్రి మాజీ మంత్రి నాగేశ్వరరావుకు కూడా కడుపు రగిలిపోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నారు.
మూడు రాజధానుల విషయం తెరమీదికి వచ్చిన కొత్తలో 2020లో దీనికి అనుకూలంగా మాట్లాడిన తొలి కమ్మ సామాజిక వర్గం నేత ఈయనే కావడం గమనార్హం. అయితే, ఇప్పుడు మాత్రం ఎందుకో.. అదే కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ధోరణిలో నాగేశ్వరరావు రాజకీయం చేస్తుండడం వైసీపీలో చర్చకు దారితీ స్తోంది. దీనికి కారణం తెలియదు కానీ, నాగేశ్వరరావు మాత్రం కమ్మలు నోరు మూసుకుంటే, వారికి ఇక, పుట్టగతులు ఉండవని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
దీనికి కారణం.. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడమే. నిజానికి ఈ ఘటన జరిగిపోయి, గవర్నర్ కూడా ఆమోదించేసి చాలా రోజులే అయిపోయింది. అయితే, ఇప్పుడు ఆయనకు గుర్తు రావడం గమనార్హం. కమ్మలకు ఇల వేల్పు అయిన ఎన్టీఆర్ పేరును తీసేస్తే కూడా మనలో స్పందనలేకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. వసంత వ్యాఖ్యలు.. ఆ సామాజిక వర్గంలో ఎలాంటి మార్పు తెస్తాయో లేదో తెలియదుకానీ, ఇలా వైసీపీ అధినేతను, ప్రభుత్వాన్ని మాత్రం టార్గెట్ చేస్తే, కుమారుడు కేపీకి మాత్రం దెబ్బ పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.